సిద్దిపేట : ఎన్నికలు అంటే మూడు రోజుల పండుగ కాదు, ఐదేళ్ల భవిష్యత్, మన అభివృద్ధి. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక హుస్నాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. గతంలో ఎంతో మంది వచ్చి వెళ్లారు. నీళ్ళు ఇవ్వలేదు, రోడ్లు ఇవ్వలేదు. అన్ని రంగాల్లో నేడు హుస్నాబాద్ అభివృద్ధి చెందుతున్నదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ రోడ్ షో(Road show)లో మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ వల్ల కాళేశ్వరం అయ్యింది. శనిగరం ద్వారా నీళ్లు వస్తున్నాయి. అన్ని గ్రామాలకు మహిళా భవనాలు పూర్తి చేశామన్నారు.
కరోనా వచ్చిన నాడు ఎవరు రాలేదు. కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ ఉన్నరని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో మోసం చేశారు. వాళ్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే కైలాసం ఆటలో పాము మింగినట్టే. ఆరు గ్యారెంటీలు ఏమో గానీ, ఆరు నెలలకు ఒక్కరూ సీఎం అవుతారన్నారు. పొన్నం ప్రభాకర్ పెద్ద పెద్ద పోస్టర్లు వేశారు. వాళ్ల దాంట్లో ఉన్న దానికంటే మన మేనిఫెస్టో ఎంతో మంచిదన్నారు.
బీజేపీ వాళ్లు కరెంట్కు మీటర్లు అంటే, కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్ అంటున్నారు. విరామం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ను, విరామం లేకుండా గెలిపించాల్సిన బాధ్యత మన పై ఉందన్నారు. కాంగ్రెస్ నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని, ఎమ్మెల్యేగా సతీష్ ను మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.