బంజారాహిల్స్, డిసెంబర్ 4: గ్రామస్థాయిలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి భారీఎత్తున స్క్రీనింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు చెప్పారు. క్యాన్సర్పై క్షేత్రస్థాయి నుం చే అవగాహన కల్పించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాల్లో 35-40 ఏండ్ల వయసున్న మహిళలందరికీ స్క్రీనింగ్ చేస్తున్నామని అన్నారు. శనివారం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో జరిగిన గ్రేస్ ఫౌండేషన్ 8వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తం గా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో కృషిచేసి వ్యాక్సిన్ను తీసుకొచ్చారని, ఇదే రీతిలో క్యాన్సర్కు మెరుగైన చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేయాలని కోరారు. వైద్యరంగం కోసం రాబోయే రెండేండ్లలో రాష్ట్ర సర్కారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నదని వివరించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలో త్వరలోనే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మించబోతున్నామని.. వరంగల్లో ఒకటి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాలుగింటిని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానను రూ.120 కోట్ల వ్యయంతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్గా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, చికిత్సకు గ్రేస్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. ఎనిమిదేండ్లలోనే 120 దేశాల్లో సేవలను విస్తరించటం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గ్రేస్ ఫౌండేషన్ కోసం తన నెల జీతాన్ని విరాళంగా అందజేస్తానని ప్రకటించారు. అక్కడే ఉన్న పలువురు దాత లు కూడా ఫౌండేషన్కు విరాళాలు ప్రకటించారు. గ్రేస్ ఫౌండేషన్ సావనీర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, గ్రేస్ ఫౌండేషన్ సీఈవో డా క్టర్ చిన్నబాబు సుంకపల్లి, వ్యవస్థాపకుడు డాక్టర్ కిరణ్ అవాంచ, డాక్టర్ వి ద్యాధర్ గారపాటి, ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ ప్రమీలారాణి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్మిశ్రా, విశ్రాంత ఐపీఎస్ అధికా రి సుజాత్రావు పాల్గొన్నారు.