హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరిందని మంత్రి హరీశ్రావు అన్నారు. తాము రాష్ట్ర సాధన కోసం ఎంత నిజాయితీగా పనిచేశామో, రాష్ట్ర సాధన అనంతరం అభివృద్ధి పనుల్లో కూడా అంతే నిజాయితీతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం టీయూడబ్ల్యూజే బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణాలతో సమానంగా పల్లెలను కూడా అభివృద్ధి చేసిందని చెప్పారు. ఒకప్పుడు ప్రజలు పల్లెల నుంచి పట్టణాలకు వలస పోతే ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెలకు వలస పోతున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ రాజీలేని పాలన కొనసాగిస్తున్నారని, ఆయన పాలనా దక్షతతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ 1గా కొనసాగుతున్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. కేంద్రం ఇచ్చే పల్లె, పట్టణ ప్రగతి అవార్డుల్లో కూడా తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ అవార్డులను దక్కించుకుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమంలో మనం దేశంలోనే నెంబర్ 1 అన్నారు. కేసీఆర్ విజన్ వల్లనే రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించగలిగామని చెప్పారు. తాము మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను 90 శాతం అమలుపర్చామని, మరికొన్ని మ్యానిఫెస్టోలో పెట్టని పనులు కూడా చేశామని మంత్రి తెలిపారు. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా పథకాలు మ్యానిఫెస్టోలో లేవని చెప్పారు.
సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం సృష్టికర్త అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలో తమ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసిందని చెప్పారు. మిషన్ కాకతీయతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని మంత్రి తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని దాటేసి తెలంగాణ నెంబర్ 1గా మారిందని అన్నారు. సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పారు. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని, నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని చెప్పారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్తగా 6 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని మంత్రి తెలిపారు. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. దేశంలో వచ్చే ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి మన దగ్గరే ఉన్నదన్నారు. ప్రైవేటు రంగంలోనూ 24 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించామని మంత్రి తెలిపారు.