జమ్మికుంట, అక్టోబర్ 20: ‘దళితుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెడితే, బీజేపీ దానిని ఆపించింది. అబద్ధాలు చెప్పే ఈటల ఎప్పటిలాగే ఆ నెపం కూ డా టీఆర్ఎస్పై నెట్టిండు. లేఖ మీరు రాశా రా?, మేం రాశామో? తేల్చుకుందాం.. దమ్ముంటే జమ్మికుంట గాంధీ చౌరస్తాకు రా?’ అని మంత్రి హరీశ్రావు బీజేపీ నేత ఈటల రాజేందర్కు సవాల్ విసిరారు. బుధవారం జమ్మికుంటలోని మోత్కులగూడెం చౌరస్తాలో నిర్వహించిన ధూంధాంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు చందర్, నరేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దళితబంధుపై బీజేపీ నాయకుడు ప్రేమేందర్రెడ్డి ఈసీకి లేఖ రాసి ఆపించాడని విమర్శించారు.
పది రోజుల్లో ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ పథకం కొనసాగుతుందని తెలిపారు. తానే దగ్గరుండి దళితులందరికీ యూనిట్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. దళితబంధు తరహాలోనే ప్రజలందరి కోసం మరో పథకం అమలు చేసేందుకు సీఎం ప్రణాళిక తయారుచేశారని చెప్పారు. బీజేపీ జీడీపీ పార్టీగా మారిందని.. జీడీపీ అం టే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచే పార్టీ అని ఎద్దేవాచేశారు. ఐదేండ్లు అధికారంలో ఉండి సేవ చేయమని ఈటలకు ఓటేసి గెలిపిస్తే.. ఆయన స్వార్థం కోసం నడమంత్రపు ఎన్నికలు తెచ్చిండని దుయ్యబట్టారు. ఈటల ఎందుకు రాజీనామా చేసిండో, ఎందుకు పార్టీ మారిండో చెప్పడని.. గెలిస్తే ఏంచేస్తడో అంతకంటే చెప్పడని మండిపడ్డారు. ఈటలకు ఆస్తుల మీదున్న ప్రేమ ప్రజల మీద లేదని ఆరోపించారు.
అన్నం పెట్టే టీఆర్ఎస్సా..
నిరంతరం ప్రజాసంక్షేమం కోసం టీఆర్ఎస్ పరితపిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై మోయలేని ధరాభారాన్ని మోపుతున్నదని హరీశ్రావు అన్నారు. ప్రజలకు సున్నం పెట్టే బీజేపీ వైపుంటారో? అన్నం పెట్టి ఆదుకునే టీఆర్ఎస్ వైపుంటారో? ఆలోచించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఓట్ల కోసం ప్రజలను ఆగం చేస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.