హైదరాబాద్ : భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట… ఇలా పేరు ఏదైనా, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్తో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నార్సింగిలో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ. 5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి వేదికగా గత నెలలో ప్రారంభించుకున్నామని తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ఇక్కడ ప్రారంభించుకున్నామని చెప్పారు.
హైదరాబాద్లోని 18 దవాఖానలకు అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఒక రోగి వెంట ఒకరో ఇద్దరో సహాయకులు కూడా వస్తారు. సర్జరీలు జరిగినప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చికిత్స కోసం రోగులు, వారి అటెండెంట్స్ రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని రోగులకు, వారి సహాయకులకు భోజనం అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు.