Minister Harish Rao | దవాఖానాకు వచ్చే రోగులతో ఆత్మీయంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను వివరించాలని మంత్రి హరీశ్రావు వైద్య సిబ్బందికి సూచించారు. సిద్ధిపేట సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీఐఎల్ సహకారంతో రూ.70లక్షల విలువైన లాప్రోస్కోపీ, వ్యాక్యూమ్ను జడ్పీ చైర్మన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సంస్థ ప్రతినిధుల బృందంతో కలిసి మంత్రి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాలలో తిరుగుతూ వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్లో వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీలో భాగంగా ఈసీఐఎల్ కంపనీ సహకారంతో లాప్రోస్కోపీ, వ్యాక్యుమ్ అందించిన అర్చన సురేష్, ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో 99.9శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయని, వాటిలో 66శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు ప్రభుత్వ దవాఖానలో జరిగితే.. 33.9 శాతం ప్రైవేటులో జరుగుతున్నాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్షన్లు ఎక్కువగా అవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై జిల్లా కలెక్టర్ వైద్యబృందం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
గర్భిణులు వ్యాయామం చేసేలా ఒక నర్సును ఏర్పాటు చేయాలని.. లేదంటే వార్డులోని ఓ హాల్లో ధ్యానం చేసేలా టీవీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కిశోర్కు సూచించారు. ఆసుపత్రిలో గత నెల డెలివరీల సంఖ్య 380 ఉందని దాన్ని రెట్టింపు చేసేలా, గర్భిణులకు అవగాహన కల్పించేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ అనే మాట ఉండొద్దని అందుకు అవసరమయ్యే పరికరాలు కొనుగోలు చేయాలని, దానికి ఆసుపత్రి వద్ద నిధులు ఉన్నాయని వాటిని ఖర్చు చేసుకోవాలని చెప్పారు.
ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సేవలు అందుబాటులో ఉండాలని అవసరమైన మేరకు సర్జరీలు నిర్వహించాలన్నారు. ఆస్పత్రిలో 80శాతం బాగుందని మిగిలిన 20శాతం ఎక్కడికి పోతుందో సిబ్బంది అధికారులు ఆరా తీసి వాటిని సరి చేసుకోవాలని సూచించారు. నంగునూరు మండలంలోని ఘనపూర్లో మహిళలను డెలివరీ ఎక్కడికి వెళ్లారని అడిగితే, ప్రైవేట్ మెడికల్ కళాశాల తదితర ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారని తెలిపారు.
ఎందుకు వెళ్లారు అని అడిగితే ఆసుపత్రిలో సిబ్బంది మాట్లాడే తీరు బాగోలేదని చెప్పినట్లుగా మంత్రి ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు రోగులతో ఆప్యాయంగా మాట్లాడాలని మరోసారి తన వద్దకు ఇలాంటి ఫిర్యాదు రావద్దని సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, ఆసుపత్రి సూపరింటెండెంట్ కిశోర్, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు.