సిద్దిపేట, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు రైతు బీమా అందిస్తున్నట్టే కార్మికులకు కార్మిక బీమా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 300 మంది బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, 59 జీవో పట్టా సర్టిఫికెట్లను అందించారు. అనంతరం కొండామల్లయ్య గార్డెన్లో జిల్లా భవన కార్మిక సంఘ సమావేశంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కార్మిక, వైద్యారోగ్యశాఖల మధ్య ఇటీవల ఒప్పందం జరిగిందని, దాని ప్రకారం కార్మికులకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ కింద ఈ సేవలను ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల్లో వినియోగించుకోవచ్చని వివరించారు. గుండె, క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులకు రూ.10 లక్షల వరకు వర్తిస్తాయని తెలిపారు. ఈ సేవలు ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అటు.. డిజిటల్ కార్డుల రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు. ఈ మేరకు అప్పటికప్పడే కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కార్మిక శాఖ కమిషనర్ రాణీకౌముదితో హరీశ్రావు ఫోన్లో మాట్లాడారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ ఏజెన్సీ ద్వారా సభ్యత్వం పొందిన కార్మికుడి వేలిముద్రలను సేకరించి, నామినీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
సమగ్ర సమాచారం కలిగి ఉండటంతో అర్హులైన మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలం పూర్తిగా అందుతాయని చెప్పారు. ఒక్కసారి డిజిటల్ కార్డు చేసుకుంటే ఐదేండ్ల వరకు ఉండేదని, రెన్యువల్ బాధలు గుర్తించి ప్రభు త్వం పదేండ్లకు పెంచిందని గుర్తు చేశారు. ఇది వరకు రూ.లక్షన్నర ఉన్న భవన నిర్మాణ కార్మికుడి బీమాను 3 లక్షలకు పెంచడానికి సీఎం కేసీఆర్తో చర్చిస్తానని తెలిపారు. కార్మిక మంత్రి మల్లారెడ్డిని ఫోన్లో కార్మికులనుద్దేశించి మాట్లాడించగా.. ‘కష్టపడ్డ, పాలు అమ్మిన , పూలు అమ్మిన, ఎమ్మెల్యేగా, మీ కార్మిక మంత్రిగా మీతో మాట్లాడుతున్నా’ అని మల్లారెడ్డి ఫోన్లో మాట్లాడి కార్మికులను ఉత్సాహపరిచారు. మంత్రి హరీశ్ సూచనల మేరకు జిల్లాకో కార్మిక భవన్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
రేవంత్, కిషన్తో తెలంగాణ మళ్లీ ఆగం!
చివరి వరకు తెలంగాణ రాష్ర్టాన్ని అడ్డుకున్న చంద్రబాబు, తెలంగాణకు రూపాయి నిధులివ్వనన్న కిరణ్కుమార్రెడ్డి కనుసన్నుల్లో పనిచేస్తున్న రేవంత్రెడ్డి, కిషన్రెడ్డితో తెలంగాణ మళ్లీ ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని, సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని మంత్రి హరీశ్ తెలిపారు. అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ద్రోహి మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డిని కిషన్రెడ్డి తోలుకొచ్చుకున్నారని విమర్శించారు. ఇంకో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబు అంటారని చెప్పారు. తెలంగాణకు అడ్డం పడింది వీరు కాదా? కరెంట్ దండగ, వ్యవసాయం దండగ అన్నారని గుర్తుచేశారు. అటువంటి ఆంధ్రా నాయకులను గురువులుగా పెట్టుకున్న నాయకుల చేతుల్లో తెలంగాణ పడితే ఉంటదా? ఈ తెలంగాణ ముంగట పడుతదా? మళ్లీ ఆంధ్రుల నాయకత్వం కావాలా? తెలంగాణ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడి, రాదన్న తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్ చేతిలో ఉంటే మంచిదా? దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్నిరంగాల్లో రాష్ట్రం అద్భుత అభివృద్ధి
అన్నిరంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. నాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టే ఉన్నామా? తెలంగాణ మారిందా? లేదా? చూడాలి అని ప్రజలను అడిగారు. సాగునీరు, తాగునీరు, రోడ్లు, కరెంట్, కొత్త జిల్లాలు, మెడికల్ కళాశాలలు తదితర సౌకర్యాలు ఎలా ఉన్నాయి? గతంలో మాదిరిగానే ఉన్నాయా? అని వెల్లడించారు. ఇవన్నీ ఆలోచన చేసి సీఎం కేసీఆర్ను మరోసారి దీవించాలని కోరారు. ‘ఎన్నికల ముందు ఎవరెవరో వస్తారు. ఏదేదో మాట్లాడుతారు. కాయకొరుకుడు మాటలు చెప్పి ఈ మూడు నెలల పబ్బం గడుపుకుంటారు. ఆ తర్వాత అవతల పడతారు. మనకు కనిపించరు. ఇసోంటి నాయకులు మనకు అవసరమా?’ అని ప్రశ్నించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ప్రతి రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉన్నదని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ ఎప్పడూ కార్మికుల సమస్యల గురించే ప్రస్తావిస్తారని, సీఎం దృష్టికి, తన దృష్టికి తీసుకొస్తారని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా పరిష్కారిస్తానని భరోసానిచ్చారు.
కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూత
కులవృత్తులను బలోపేతం చేసే దిశగా వృత్తిపై ఆధారపడిన వారికి రూ.లక్ష అందించాని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీశ్ తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తామని వివరించారు.
తెలంగాణ చేపలకు మస్తు డిమాండ్
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ చేపలు దిగుమతులు చేసుకునే పరిస్థితిలో ఉండేదని, ఇప్పుడు దేశంలోని అనేక రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, తెలంగాణ చేపలకు మస్తు డిమాండ్ ఉన్నదని హరీశ్రావు వెల్లడించారు. ‘మనకు చేపలు కావాలంటే దాదాపు ఆంధ్రా నుంచే వచ్చేవి. తెలంగాణ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా చేప పిల్లలు వదులుతుండటంతో నీలివిప్లవం సాకారమైంది. ఎక్కడ చెరువులు, వాగులు, రిజర్వాయర్ల వద్ద చూసినా చేపల జాతరే కనిపిస్తున్నది. సిద్దిపేట జిలా ఇప్పుడు ఆంధ్రాకే చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరింది. చేపలను పశ్చిమబెంగాల్లోని కోల్కతా, మహారాష్ట్రలోని చంద్రాపూర్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, కాకినాడకు ఎగుమతి చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మారెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.