హుజూరాబాద్లో కాంగ్రెస్ ఉనికే లేదు. దానికి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీ గురించి మాట్లాడటం శుద్ధ దండగ. ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఉంటాయి. ఏ తోవలో పోతే సంతోషంగా ఉంటామో ఓటర్లు ఆలోచించుకోవాలి. వ్యవసాయ మార్కెట్లను రద్దు చేయడంతోపాటు బాయిలకాడ మీటర్లు పెడుతానంటున్న బీజేపీకి ఓటుతో సమాధానం చెప్పాలి.
–మంత్రి తన్నీరు హరీశ్రావు
హుజూరాబాద్, సెప్టెంబర్ 27: రైతును రాజును చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కష్టపడుతుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయంలో నల్లచట్టాలు తీసుకొచ్చి రైతుల ఉసురు తీస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ రైతుల నుంచి దొడ్డు వడ్లు కొనటానికి బీజేపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నదని, అలాంటి పార్టీకి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో వరి రైతులు, విత్తనోత్పత్తిదారుల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్రావు మాట్లాడారు. ఏడేం డ్ల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడెలా మారిందో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. విత్తనాలు, ఎరువులకోసం పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగడంతోపాటు దుకాణాల ముందు రోజం తా లైన్లో నిలబడే దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవని, నేడు అట్లా ఉన్నదా..? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని తెలిపారు. రైతుల కోసం 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నది ఎవరు? పండిన పంట మొత్తం కొంటున్నది ఎవరో ఆలోచన చేయాలని సూచించారు. వ్యవసాయంలో నల్ల చట్టాలను తెచ్చి రైతుల ఉసురు తీస్తున్న బీజేపీ వైపు ఉంటారో.. రైతులను అన్ని రకాలుగా ఆదుకొంటున్న టీఆర్ఎస్ వైపు నిలుస్తారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడకుండా ఉంటుందని హరీశ్రావు తెలిపారు. కష్టం విలువ తెలిసిన శ్రీనివాస్, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని అన్నా రు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, సీడ్ ప్లాంట్స్ యజమానులు పుల్లూరి ప్రభాకర్రావు, ఐల్నేని భాస్కర్రెడ్డి,లక్ష్మారెడ్డి, రామకృష్ణారావు, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్కాల క్రాస్రోడ్డు వద్ద నాగార్జున డెయిరీలో కొత్తగా నిర్మించిన కోల్డ్ స్టోరేజీని మంత్రి ప్రారంభించారు.
ఏడేండ్లు మంత్రిగా, పదేండ్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల నియోజకవర్గానికి ఒరగబెట్టింది ఏమీలేదని మంత్రి విమర్శించారు. అభివృద్ధి గురిం చి మాట్లాడితే రాజేందర్కు కోపం వస్తున్నదని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ ప్రతి మంత్రితోపాటు ఈటలకు కూడా 4వేల డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే ఒకటీ ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మంత్రిగా ఏమీచేయని ఈటల, బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్చేశారు. బొట్టు బిళ్లలు, గడియారాలు, గ్రైండర్లు, మేక పిల్లలు, మందు బాటిళ్లు ఈటల ఇవ్వవచ్చు కానీ.. తాము అభివృద్ధి పనులు చేస్తే తప్పెలా అవుతుందని నిలదీశారు.