సిద్దిపేట : రాష్ట్రంలోని రజకుల చెంతకు ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సిద్దిపేట ఎర్ర చెరువు దోబీ ఘాట్లో రూ. 1.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన శారీ, బెడ్ షీట్ రోలింగ్ మెషీన్లతో పాటు టాటా ఏస్ వాహనాన్ని హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రజకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. వారికి నిత్యం ఉపాధి లభించేలా ఈ రోలింగ్ మెషీన్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. శారీ, బెడ్ షీట్ రోలింగ్ యంత్రాలను రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేటలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ రోలింగ్ చేసిన బట్టలను తిరిగి డెలివరీ చేసేందుకు రూ. 6 లక్షలతో టాటా ఏస్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నాలుగేండ్ల కింద రూ. 1.40 కోట్లతో మోడ్రన్ మెకనైజ్డ్ దోబీ ఘాట్ను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. అప్పట్నుంచి రజకులకు కాస్త విశ్రాంతి లభించిందన్నారు.
-30 కిలోల కెపాసిటీ కలిగిన 3 వాషింగ్ మెషీన్లు, 3 స్పిన్నర్లు, 2 డైయ్యర్లు, ఇస్త్రీ చేయడానికి 3 ఐరన్ ఎలక్ట్రిక్ టేబుల్స్ అందుబాటులో ఉన్నాయి.
-8 గంటల్లోనే టన్ను బరువు గల బట్టలను ఉతికే సామర్థ్యం ఈ దోబీ ఘాట్కు ఉంది. దీంతో పట్టణంలోని 500 మంది రజకులకు పని భారం తగ్గింది.
-శారీ, బెడ్ షీట్ రోలింగ్ యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ బట్టలను రోగింగ్ చేసే అవకాశం ఉంది. గంటకు 20 నుంచి 30 చీరలను రోలింగ్ చేయొచ్చు.