సిద్దిపేట: సిద్దిపేటలోని కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు ఆనందం వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశ ప్రజలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయడానికి ఈ సెంటర్ను నెలకొల్పడంతో తెలంగాణ ప్రత్యేకతను సాధించిందన్నారు. కొండపాకలో కొత్తగా నిర్మించిన శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స, పరిశోధన కేంద్రాన్ని సద్గురు మధుసూదన్సాయితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి వంద మంది చిన్నారుల్లో ఒకరు గుండె సంబంధిత వ్యాధితో మృత్యువాతపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని సద్గురు మధుసూదన్ సాయి గారిని కోరగానే సానుకూలంగా స్పందించారని, కొండపాకలో బాలల గుండె శస్త్ర చికిత్స కేంద్రాన్ని నెలకొల్పారన్నారు.
ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనివిధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మానవ సేవయే మాధవ సేవగా భావించే మధుసూదన్ సాయి చేతుల మీదుగా విద్యాలయాలు, వైద్యాలయాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొండపాక విద్యా వైద్యాలయం సింబల్ ఆఫ్ చారిటీగా నిలుస్తున్నదని తెలిపారు. ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుచేసేలా కృషి చేసిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు ఈ వైద్యాలయం ద్వారా కావాల్సిన వైద్య చికిత్సలు అందిస్తామని శ్రీ సద్గురు మధుసూదన్ సత్యసాయి వెల్లడించారు. నవంబర్ 23న సత్యసాయిబాబా జన్మదినం సందర్భంగా నేడు ఈ వైద్యాలయాన్ని ప్రారంభించుకున్నామని చెప్పారు. మనుషుల్లో ఉండే భగవంతుని గుర్తించడమే నిజమైన మాధవ సేవ అన్నారు.