హైదరాబాద్ : నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న పిల్లల్ల వార్డులను మంత్రి హరీశ్రావు సందర్శించారు. పిల్లలకు వైద్యం ఎలా అందుతుంది.. ఏ వ్యాధి బారిన పడ్డారు.. సమయానికి భోజనం అందుతుందా.. అనే అంశాలను వారి తల్లులను హరీశ్రావు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అని హరీశ్రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్య శాఖను అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సీఎం రూ. 133 కోట్లు విడుదల చేశారని హరీశ్ రావు తెలిపారు. రూ. 33 కోట్లతో నిలోఫర్లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. తల్లీశిశు మరణాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. నగరం నలువైపులా నాలుగు మెడికల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే మరో 8 వైద్య కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్యంపై ప్రభుత్వం, డాక్టర్లు.. ప్రజలకు మరింత విశ్వాసం కల్పించాలి అని హరీశ్రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డి, నిలోఫర్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హైసియా ఎండీ భరణి, నిర్మాన్, ఇన్ఫోసిస్, ఓపెన్ టెక్స్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిలోఫర్లో మరో 25 ఐసీయూ పడకలను రూ. 1.75 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.