హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడుచోట్ల రూ.7.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. గాంధీ, పేట్లబుర్జ్తోపాటు వరంగల్లోని ఎంజీఎం దవాఖానల్లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రూ.2.50 కోట్లతో స్థాపించబోమే ఒక్కో సంతాన సాఫల్య కేంద్రం సంతానం లేనివారికి వరంగా మారనున్నదని చెప్పారు. సర్కార్ వైద్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, జాతీయ స్థాయిలో 3వ స్థానం దక్కించుకున్నదని తెలిపారు. బీజేపీ సర్కారు అధికారంలో (డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) ఉన్న ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో నిలిచిందని అన్నారు. ఆదివారం గాంధీ దవాఖానలో రూ.25 కోట్లతో క్యాథల్యాబ్, ఎంఆర్ఐను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో కలిసి ప్రారంభించారు.
రూ.2.70 కోట్లతో నిర్మించే అధునాతన కిచెన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అమలు చేస్తున్న ప్రతి ఆరోగ్య పథకం దేశానికి ఆదర్శంగా నిలించిందని గుర్తుచేశారు. మన దగ్గర ప్రారంభించిన సింగిల్యూజ్డ్ డయాలసిస్ కేంద్రాలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఏర్పాటుచేయబోతున్నారని చెప్పారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను కార్పొరేట్కు దీటుగా పేదలకు అందుబాటులోకి తేవాలని గాంధీలో రూ.30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందులో 9 అత్యాధునిక థియేటర్లు ఉంటాయని, ఈ కాంప్లెక్స్లో ఖరీదైన ఆరు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని చెప్పారు.
అన్ని జిల్లాల్లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు
గాంధీలో మూడు నాలుగు నెలల్లో 48 మందికి, ఉస్మానియాలో ఆరు నెలల్లో 50కి పైగా మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలోనే గాంధీలో మాడ్యులర్ థియేటర్ను అందుబాటులోకి తెస్తామని అన్నారు. నిజామాబాద్, వేములవాడ, సిద్దిపేట తదితర జిల్లాల దవాఖానల్లో సైతం మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించినట్టు చెప్పారు.