కామారెడ్డి: తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కిట్ను కాబోయే తల్లులు మాత్రమే వినియోగించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కలేక్టరేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ కిట్ రూపొందించాని వెల్లడించారు.
తల్లీ, బిడ్డ బాగుండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రొటీన్ డైట్ ఉంటుందన్నారు. ప్రతి కిట్ విలువ రూ.2 వేలు ఉంటుందని వెల్లడించారు. ప్రతి గర్భిణికి రెండుసార్లు న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. పౌష్టికాహార కిట్తో తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని చెప్పారు. సీఎం కేసీఆర్ బృహత్తర ప్రణాళికతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలకు ఏం కావాలో ఆలేచించే నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో బాలికల కోసం 551 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. పన్నులు వేయడం బీజేపీ పని, పనులు చేయడం బీఆర్ఎస్ పని అని చెప్పారు. కేంద్రానికి విభజన రాజకీయాలని, తమవి న్యూట్రిషన్ పాలిటిక్స్ అని వెల్లడించారు.
ప్రొటీన్స్ , మినరల్స్ , విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ల లక్ష్యం. మొదటి కిట్ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ సమయంలో, రెండోకిట్ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో ఇవ్వనున్నారు. దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు పథకం ఉపయోగపడనున్నది. తొలివిడుతలో 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేయనున్నారు.