సిద్దిపేట : ప్రతి విద్యార్థి పరీక్షలను పండుగల్లా భావించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. పదో తరగతి చదివే విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఉత్తరం రాస్తానని మంత్రి పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ పెట్టి సిద్ధిపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు హరీశ్రావు సూచించారు.
జిల్లా కేంద్రంలోని సిద్ధిపేట న్యూ హైస్కూల్లో ఎన్ఆర్ఐ డాక్టర్ రాగి గంగారాం సహకారంతో రూ.25 లక్షలతో నిర్మించిన భోజనశాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తాను చదివిన పాఠశాలకు డైనింగ్ హాల్ కట్టించి, అందరికీ గంగారాం స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఎవరైనా సరే కన్నతల్లిని, చదివిన బడిని, సొంత ఊరును మరచి పోవద్దనే పదానికి గంగారాం సార్ధకత చేకూర్చారని ప్రశంసించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధన ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.7300 కోట్లు వెచ్చించి కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ సకల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా విద్యాశాఖ అధికారులు, టీచర్లు కృషి చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 7-12వ తరగతి చదివే విద్యార్థినులకు రూ.100 కోట్ల వ్యయంతో హెల్త్ అండ్ హైజనిక్ కిట్లు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తామన్నారు.
న్యూ హైస్కూల్ విద్యార్థులకు అవసరమైన ప్లేట్లు అందించేందుకు ముందుకొచ్చిన పుల్లూరి శివకుమార్ను మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ పాఠశాలలో చదివే వికలాంగురాలు భార్గవికి స్కూటీ, ఉన్నత విద్యకై మిట్టపల్లి గురుకుల పాఠశాలలో సీటు ఇప్పిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.