సిద్దిపేట : గతంలో సిద్దిపేటలో నలు దిక్కులా ప్రదేశాలు చెత్తతో నిండి పోయేవి. సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదనే ఉద్దేశంతోనే బయో-CNG ప్లాంట్ను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
సిద్దిపేట గ్రామీణ మండలం బుస్సాపూర్లో సోమవారం బయో-సీఎన్జీ ప్లాంట్ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డా. ఆండ్రూ ఫ్లెమింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బయో -CNG ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట పుర ప్రజలని పేర్కొన్నారు. చెత్తను తడి, పొడి, హానికారక చెత్తను ప్రజలు విభజన చేయడం వల్లే బయో – CNG ఏర్పాటు సాధ్యం అయ్యిందన్నారు.
చెత్తతో బాధపడుతున్న ప్రపంచం
ప్రపంచం మొత్తం చెత్తతో బాధపడుతుందని మంత్రి తెలిపారు.
ల్యాండ్ ఫిల్లింగ్తో భూమి, నీరు కలుషితం అవుతుంది. అనేక అనారోగ్యాలకు హేతువుగా మారుతుందన్నారు. రోజుకు సిద్దిపేట పట్టణంలో 55 వేల కిలోల చెత్త ఉత్పత్తి అవుతుంది. ప్రజా భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో స్వచ్ఛ పట్టణంగా సిద్దిపేట రూపుదిద్దుకుందన్నారు.
అభివృద్ధి అంటే ఆరోగ్యమే..
సిద్దిపేటను చెత్తను కుప్పలుగా పోయని పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే..ఆరోగ్య వాతావరణంలో జీవించే గలిగే పరిస్థితులను సృష్టించడమని స్పష్టం చేశారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చుతున్నాం. బయో – CNG గ్యాస్ ను పట్టణంలో రెస్టారెంట్లకు సరఫరా చేస్తాం. మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా బయో – CNG గ్యాస్ ను ఉపయోగిస్తామని మంత్రి వెల్లడించారు.
ఆరోగ్య సిద్దిపేట అందరి బాధ్యత..
పిల్లలకు ఆస్తులు, అంతస్తులు కంటే ఆరోగ్యాన్ని ఇవ్వడమే ముఖ్యం అన్నారు. ఆరోగ్య సిద్దిపేట తయారీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. సఫాయి అన్న సలాం అన్నాడు సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు సిద్దిపేట పట్టణం 14 జాతీయ స్థాయి అవార్డులు, 4 రాష్ట్ర స్థాయి అవార్డులను సిద్దిపేట చేజిక్కిoచు కోవడంలో సఫాయిలు ముఖ్య పాత్ర వహించారన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట దిక్సూచిగా నిలిచినట్లే అభివృద్ధికి కూడా దిక్సూచిగా నిలుపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.