డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎం తిరాత్ సింగ్ రావత్ రాజీనామా వ్యవహారంలో కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం హరీష్ రావత్ విమర్శలు గుప్పించారు. ఉత్తరాంఖండ్లో ఐదేండ్లలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు. రాజ్యాంగ అనివార్యత వల్లే తిరాత్ రావత్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారని, కరోనా మహమ్మారితో ఉప ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందని బీజేపీ పేర్కొనడం అతిపెద్ద అబద్ధమని హరీష్ రావత్ మండిపడ్డారు.
కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్నా గతంలో ఉప ఎన్నికలు జరిగాయని చెబుతూ బీజేపీ సాకులు నమ్మదగినవి కావని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్లోని సాల్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిచారని ముఖ్యమంత్రి అక్కడి నుంచి కూడా పోటీ చేసి ఉండాల్సిందని అన్నారు. మరొకరి చేత రాజీనామా చేయించే బదులు సీఎం ఆ స్ధానం నుంచి పోటీ చేయాల్సిందని చెప్పారు. చట్టాల గురించి కనీస పరిజ్జ్ఞానం కొరవడటంతో రాష్ట్రంపై మరో ముఖ్యమంత్రిని రుద్దుతున్నారని వ్యాఖ్యానించారు. ఐదేండ్లలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను ఇచ్చిందని అన్నారు.