Minister Harish Rao | సిద్దిపేట, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం దండగ అంటూ కూతలు కూస్తున్న కాంగ్రెస్ నాయకుల నోర్లను ఫినాయిల్ పోసి కడగాలని మంత్రి హరీశ్రావు అన్నారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్లో ముంచితే అందులో నీళ్లు ఉన్నయా? లేవా? అన్నది వీళ్లకు అర్థం అవుతుందని మండిపడ్డారు. కాళేశ్వరం పనులు కాకపోతే చెరువులు, చెక్ డ్యామ్లు ఎలా నిండుతున్నాయని ప్రశ్నించారు. బుధవారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ భూమిపూజ చేశారు.
పట్నం వేసి కల్యాణోత్సవానికి హాజరై మల్లన్నను దర్శించుకొన్నారు. అనంతరం సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో రైతులకు స్ప్రింక్లర్ల పంపిణీ, ఆయిల్పామ్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ‘కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్గాంధీ మాట్లాడటం విడ్డురంగా ఉన్నది. అసలు ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిందే రూ.80 వేల కోట్లు. అందులో రైతుల భూములు, అటవీశాఖ భూములకు రూ.10 వేల కోట్లు అయ్యింది. ఇగ యాడ పనులు జరుగలేదు? మొత్తం అవినీతి జరిగిందా? పని కానిదే నీళ్లు వస్తున్నయా? ప్రాజెక్టుల నిర్మాణాలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వాటన్నింటినీ సీఎం కేసీఆర్ పటాపంచలు చేసి రికార్డు సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేశారు’ అని తెలిపారు.
ఎన్నికల కోసం ఆపద మొక్కులు
ఓట్ల కోసం ఆపద మొకులు మొకే కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్రావు అన్నారు. దివ్యాంగులకు దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నది తెలంగాణలోనేనని తెలిపారు. తాము పాలించే రాష్ర్టాల్లో పింఛన్లు ఇవ్వని బీజేపీ, కాంగ్రెస్.. ఇక్కడ ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కొమురవెల్లి మల్లన్న గుడి దినదినాభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం రూ.36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్టు తెలిపారు.
యాసంగిలో 55 లక్షల ఎకరాల పంట
ఏదో ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్పై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాళేశ్వరం నీళ్లతో యాసంగిలో 55 లక్షల ఎకరాల పంట పండింది. పండిన పంట ధాన్యాన్ని రూ.26 వేల కోట్లతో కొన్నాం’ అని వివరించారు.
ఎండమావులకు ఆశపడొద్దు
‘ఎండమావులకు ఆశపడొద్దు. ధోకే బాజ్లకు లొంగవద్దు. రైతులెవరూ అధైర్యపడొద్దు. సీఎం కేసీఆర్ మీకు అండగా ఉంటారు. కాలమైతదో.. కాదోనని బెంగపడొద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతు ధైర్యంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’ అని మంత్రి హరీశ్ తెలిపారు. దేవాదుల నీళ్లు తెచ్చి తపాస్పల్లి రిజర్వాయర్, కాళేశ్వరం ద్వారా మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్, రంగనాయక, కొండపోచమ్మ, అంతగిరి, గౌరవెల్లి రిజర్వాయర్లు నింపి రైతులకు కాల్వల ద్వారా పంటపొలాలకు నీళ్లు అందిస్తామని వివరించారు.