హైదరాబాద్ : మహిళలను అవమానించింది బీజేపీ నేతలనేనని, మహిళ అయినందుకు గవర్నర్ను బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు ఆహ్వానించలేదని బీజేపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పందంగా ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రధాని కాగానే.. గుజరాత్ గవర్నర్ కమలాబేణి వాల్ను డిస్మస్ చేశారని, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఇటీవల అందరు మాతృమూర్తులను అవమానించారని గుర్తు చేశారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భేటి బచావో భేటీ పడావో నిధుల్లో 80శాతం మోదీ ప్రచారానికి ఖర్చు పెట్టారని పార్లమెంట్ స్థాయీ సంఘం చెప్పిందన్నారు. ఎవరు మహిళలను అవమానపరుస్తున్నారో తెలుస్తుందన్నారు. రాజ్భవన్కు బీజేపీ వాళ్లు ఎందుకు కాషాయ రంగు పులుముతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ను రాజకీయాల్లోకి లాగుతుదన్నది బీజేపీ నేతలలేనని, ఏదైనా ఉంటే శాసనసభ సచివాలయం, రాజ్భవన్లు చూసుకుంటాయన్నారు. అవగాహన లేకనే బీజేపీ నేతలు కోర్టుకు వెళుతాం అంటున్నారని, శాసనసభకు ఉన్న హక్కులు బండి సంజయ్కి తెలియవా? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థపై కేసీఆర్కు గౌరవం ఉందని, గతంలో గవర్నర్ నరసింహన్ను ఇప్పుడు.. తమిళిసైని గౌరవిస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం దారి చూపే కాగడ అయితే.. బీజేపీది వెలుగునివ్వని దీపమన్నారు. బండి సంజయ్ ఓ సారి రాజ్యాంగాన్ని చదువుకోవాలని, బండి సంజయ్ మీద ఆ పార్టీలోనే అసమ్మతి ఉందని, రాజ్యాంగం మీద, గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్కు గౌరవం ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు తెలుసునన్నారు. బలం లేకున్నా అర్ధరాత్రి సీఎంలతో ప్రమాణం చేయించిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదన్నారు. చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం సరికాదని, ప్రోరోగ్ కాలేదు కనుకనే గవర్నర్ను పిలువలేదన్నారు. దేశ భక్తి గురించి మాకు బీజేపీ చెప్పనవసరం లేదని, పీఎం మోదీ పాక్కు వెళ్లి ఎవరి విందు స్వీకరించారోనన్నారు. రాజకీయ రంగు పులిమితే అది బీజేపీకే తగులుతుందని, మాతృమూర్తులను అవమానించిన బీజేపీకి మహిళల గురించి మాట్లాడే హక్కే లేదన్నారు.