జహీరాబాద్ సెప్టెంబర్ 24 : వ్యవసాయ శాఖ అధికారుల వద్ద పంటల సాగు వివరాలు లేకపోవడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు క్లస్టర్ వారిగా అధికారులను నియమించినా ఎందుకు పనిచేయడం లేదన్నారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు.
గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్యరావు, జిల్లా కలెక్టర్ శరత్, ఉమ్మడి జిల్లా డీసీఎం చైర్మన్ శివకుమార్ తదితరులు ఉన్నారు.