కవాడిగూడ, నవంబర్ 5: తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మొదటి అసెంబ్లీలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపారని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. కానీ, కేంద్రంలోని మోదీ సర్కార్ వర్గీకరణ తీర్మానంపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన మాదిగ యుద్ధభేరి సభకు మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఎన్నో ఏండ్లుగా నిరంతరం పోరాడుతున్నదని అన్నారు.
స్వరాష్ట్రం సిద్ధించాక, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని తెలిపారు. నాటి ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరితో తీర్మాన కాపీలను ఢిల్లీకి పంపించామని గుర్తుచేశారు. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి, వర్గీకరణపై అసెంబ్లీ తీర్మాన కాపీని అందజేశారని స్పష్టంచేశారు. కానీ, మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసిందని విమర్శించారు. శాసన సభ పంపిన తీర్మానంపై పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయడానికి మోదీ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో తెలియట్లేదని అన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, ఎస్సీ వర్గీకరణ కల బీఆర్ఎస్ సాకారం చేస్తుందని స్పష్టంచేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, తొమ్మిదిన్నరేండ్లు గడిచినా ఊసే ఎత్తలేదని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. మంత్రి హరీశ్రావు హామీ ఇస్తే వారం రోజుల్లో మాదిగల భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, ఆ సభకు సీఎం కేసీఆర్ను తీసుకురావాలని కోరారు. మాదిగల పూర్తి మద్దతు బీఆర్ఎస్కే ఉంటుందని స్పష్టంచేశారు. ఎమ్మార్పీఎస్ పేరుతో కొంతమంది వ్యక్తులు మాదిగలను వర్గీకరణ పేరుతో మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణ రాజు, రాష్ట్ర నాయకులు సండ్ర వెంకటయ్య, బంగారి శ్రీనివాస్, బాబురావు, మహిళా అధ్యక్షురాలు రుక్కమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దళితజాతి అభ్యున్నతి కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని హరీశ్రావు చెప్పారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.10 లక్షల సాయం అందజేసి, దళితులను ఓనర్లుగా, వ్యాపారులుగా మార్చారని పేర్కొన్నారు. జిల్లాకో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి దళిత విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికో ఎస్సీ గురుకులం, రాష్ట్రవ్యాప్తంగా 50 ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఎస్సీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా గుర్తిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్లో మాదిగల ఆత్మగౌరవ భవనం నిర్మించి, సదాలక్ష్మి విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఉద్యమాన్ని గౌరవిస్తుందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో డైట్, శానిటైజేషన్ విభాగాల్లో ఎస్సీ రిజర్వేషన్స్ అమలు చేస్తున్నామని వివరించారు. ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్స్ తెచ్చామని స్పష్టంచేశారు. నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.