Nomula Bhagat : పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నాశనం చేస్తూ కాంగ్రెస్ సర్కారు జారీచేసిన జీవో 97 ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, బీఆర్ఎస్ నాయకులు రాకేశ్రెడ్డి తదితరులు నాగార్జునసాగర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. NH-565 పై బైఠాయించి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తెచ్చి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మూడేళ్లు పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసి ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరే విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ రెడ్డికి విద్యాశాఖ మీద, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్య మీద అవగాహన లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకునేలా జీవో 97 తెచ్చారని మండిపడ్డారు. మూడేళ్లు ప్రాక్టికల్స్తో కూడిన అత్యున్నత ప్రమాణాలు గల పాలిటెక్నిక్ విద్యార్థులను ఐటీఐ విద్యార్థులతో కలుపాలని చూడటం దుర్మార్గమని అన్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇన్నాళ్లు వరంగా ఉన్న పాలిటెక్నిక్ విద్యను రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఆగం చేస్తున్నాడని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ పాపాన్ని మూటకట్టుకుంటున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. తక్కువ సమయంలో సాంకేతిక విద్యలో ప్రావీణ్యత సాధించి, తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి అవగాహన లేకుండా తెచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.