Minister Harish Rao | కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే
భరోసానిచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాలులో విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆయూష్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగపాణి, సమన్వయ కర్త శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ జరిగింది. మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో సేవలు అందించే ఒక గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. మొత్తం 1154 మందికి ఎంఎల్ హెచ్పీగా అవకాశం కల్పించినట్లు తెలిపారు. 3071 మందిలో ఎంఎల్ హెచ్పీలు మూడోవంతు ఉన్నారన్నారు. 1987లో డెయిలీ వేజేజ్పై ఆయుర్వేద వైద్యుల భర్తీ జరిగితే.. 1999లో, 2006లో, 2011లో భర్తీ జరిగిందని చెప్పారు.
ఈ నాలుగు సార్లు చేసిన భర్తీ ప్రక్రియ ద్వారా మొత్తంగా 400 మందికి కూడా అవకాశం రాలేదని, కానీ.. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం ద్వారా ఒకేసారి 1154 మందికి అవకాశం కలిగిందన్నారు. ఇది వైద్య చరిత్రలో గొప్ప మార్పన్నారు. ఆర్బీఎస్కేలో కూడా ఎంఎల్ హెచ్పీలతోనే ఎక్కువ సేవలు అందుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి సమయంలో సంప్రదాయ వైద్యమే మందు అని ఎంతో మంది నమ్మి ఆచరించి.. ప్రాణాలు కాపాడుకున్నారన్నారు. ప్రభుత్వ ఆయుర్వేద ఫార్మసీ ద్వారా తయారు చేసిన జీవన్ ధార ఔషధాన్ని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిందని, సీఎం కేసీఆర్ సహా అందరూ జీవన ధార ఔషధాలను వాడారన్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రపంచాన్ని భయపెట్టిందని, మందులు కూడా లేని సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయుర్వేద కళాశాల వైద్య బృందం ఎంతో పరిశోధించి బ్లాక్ ఫంగస్కు మెడిసిన్ ఆవిష్కరించిందన్నారు.
బ్లాక్ ఫంగస్కు ఔషధం కనుగొనడం తెలంగాణలో జరగడం మనందరికీ గర్వకారణమన్నారు. క్వారెంటైన్ సెంటర్గా ఆయుష్కు సంబంధించిన నాలుగు ఆసుపత్రులు నేచురోపతి, బీఆర్కేఆర్, హోమియో ఆసుపత్రులు విశేష సేవలందించాయన్నారు. రెండు దఫాలుగా చేసుకున్న కంటి వెలుగు కార్యక్రమంలో మంచి సేవలందించారంటూ అభినందనలు తెలిపారు. వైద్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయుష్ చికిత్సల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. ప్రకృతి వైద్యం కోసం ఎంతో మంది ప్రైవేటుకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని, అలాంటి వారికి అతి తక్కువ ఖర్చుకే ఉత్తమ వైద్యం అందించేందుకు నేచర్ క్యూర్ ఆసుపత్రిని రూ.10 కోట్లతో అందంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. హెల్త్ హబ్ హైదరాబాద్లో చికిత్స పొందేందుకు దేశ విదేశాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారన్నారు.
ఆయుష్ వైద్యం పొందేందుకు సైతం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేలా ఎదగాలని, ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలిపేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, ఐదు కాలేజీలు, నాలుగు రీసెర్చ్ హాస్పిటల్స్ ఉన్నాయని తెలిపారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అన్నీ జిల్లాలకు విస్తరించే ఆలోచన సీఎం కేసీఆర్ చేస్తున్నారని, అనంతగిరి హిల్స్లో జిందాల్ ఆయుర్వేద ఆస్పత్రిని మించి సెంటర్ ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్లో ప్రతి రంగంలో హబ్గా మారుతున్నదని, ఫార్మా, వాక్సిన్, ఐటీ రంగంతో పాటు వైద్యరంగంలోనూ తెలంగాణ హబ్గా మారిందన్నారు. తాజాగా ఆయుర్వేదంలోనూ హబ్గా మారుతుందని, 9 ఏండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి పేర్కొన్నారు. నీతి అయోగ్ ఇండెక్స్లో 2014లో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుతుందని వివరించారు.