Harish Rao | హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా కేసీఆర్ను విమర్శించడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. శనివారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి గల్లీలో విమర్శిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మోదీ అన్నారు.. కేసీఆర్ గొప్పతనం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అని హరీశ్రావు స్పష్టం చేశారు.
రాష్ట్రానికి నిధులు ఇచ్చామని ప్రధాని అంటున్నారు.. మీరు డబ్బులు ఇవ్వలేదు. మాకు రావాల్సిన నిధులు ఆపారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. మీకు ఈడీ, సీబీఐ అండగా ఉండొచ్చు. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు అని హరీశ్రావు స్పష్టం చేశారు.