ఖాళీ కడుపుతో చదువుకునే అవస్థ ఇకలేదు.. పేదవిద్యార్థి పౌష్టికాహారానికి లోటులేదు. ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీ పాఠశాలలో ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి సబిత, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ లాంఛనంగా ప్రారంభించారు. కేటీఆర్ సహా మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు వివిధ పాఠశాలల్లో ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ను ప్రారంభించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. రాష్ట్రంలోని 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ను అందించనుండగా, దేశంలో తొలిసారిగా హైస్కూల్ విద్యార్థులకూ దీన్ని అమలు చేయనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం పేదపిల్లలకు వరమని, ఇది విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే పథకమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్ స్కూల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. చిన్నారులకు ప్రేమగా ఇడ్లీలు తినిపించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోని ఇండ్లల్లో పిల్లలు ఏం తింటారో అదే మెనూను ‘సీఎం బ్రేక్ఫాస్ట్’లో చేర్చి సర్కారు బడుల్లోని చిన్నారులకు అందజేస్తున్నామని చెప్పారు.
1-10వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ను సమకూర్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. ఇది విద్యార్థుల కడుపునింపే కార్యక్రమం మాత్రమేకాదని, డ్రాపౌట్రేటును తగ్గించి, విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే పథకంగా అభివర్ణించారు. ‘చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తుంటారు. డ్యూటీలకు వెళ్తుంటారు. ఆయా కుటుంబాలకు చెందిన పిల్లలు తినకుండా స్కూళ్లకు వస్తున్నారు. ఆకలైతే చదువు బుర్రకెక్కే అవకాశముండదు. ముందు కడుపునిండితేనే బుర్రకెక్కుతుంది. అందుకు విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టాం’ అని వివరించారు. ఇంగ్లిష్ మీడియం చదువులను అందుబాటులోకి తెచ్చామని, వెయ్యికి పైగా గురుకులాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ఆడ పిల్లల కోసం సగానికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశామని, 70కి పైగా మహిళా డిగ్రీ కాలేజీలను నెలకొల్పామని తెలిపారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని వెల్లడించారు.
కేసీఆర్ మానవీయ సీఎం అని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం మానవీయ ప్రభుత్వమని, మంత్రి హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ అమలుచేసే ప్రతి పథకంలో మానవీయ కోణం ఉంటుందని వెల్లడించారు. బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపేందుకు కల్యాణలక్ష్మి, ప్రభుత్వ దవాఖానల్లో వందశాతం సహజ ప్రసవాలు, మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేసీఆర్ కిట్, మలేరియా, డయేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులను తగ్గించి ప్రజల ఆరోగ్య ప్రమాణాల పెంపునకు మిషన్ భగీరథ, విద్యాప్రమాణాల పెంపు కోసం ఇంగ్లిష్ మీడియం చదువులు.. తాజాగా డ్రాపౌట్ రేట్ను తగ్గించడం, ఆడపిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల మీద భారం, ఒత్తిడి తగ్గుతాయని తెలిపారు.
పేద విద్యార్థుల కడుపునింపేందుకు ప్రవేశపెట్టిందే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంత గొప్ప పథకం ప్రవేశపెట్టినందుకు రాష్ట్రంలోని చిన్నారులంతా మనస్ఫూర్తిగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పౌష్టికాహారంతో కూడిన మెనూను రూపొందించామని తెలిపారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, మున్సిపల్శాఖల సమన్వయంతో పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. ‘నేను స్కూళ్లను సందర్శించిన క్రమంలో బడికొచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని వస్తారా? అని ఓ 10 మంది విద్యార్థులను అడిగితే 8 మంది కేవలం టీ తాగి వస్తామని చెప్పారు. స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసేవరకు అలాగే ఉంటామని అన్నారు. అది నన్ను చాలా కలిచివేసింది’ అని తెలిపారు.
బేక్ఫ్రాస్ట్ను అమలుచేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన ఎంత గొప్పగా ఉందో పిల్లలతో మాట్లాడిన తర్వాతే తనకు అర్థమైందని అన్నారు. దేశంలోనే విద్యార్థులకు రాగిజావను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంతో అన్ని హంగులతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా రూ.7 వేల కోట్లు ఖర్చుపెట్టి బడుల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని చెప్పారు. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 9, 10వ తరగతులకు భోజనం పెడుతున్నట్టు వివరించారు. ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్సీలు శంబీర్పూర్ రాజు, రఘోత్తంరెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హన్మంతరావు, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ యువ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి పాల్గొన్నారు.
మేం ఇంట్లో తినే టిఫిన్లనే స్కూల్లో రోజుకో రకం పెట్టడం బాగా నచ్చింది. దీంతో అమ్మకు కష్టం తప్పింది. ఆలస్యమవుతుందని సగం తినీ, తినక ఆగమాగంగా స్కూల్కు రావడం ఇకపై ఉండదు. ఇప్పటికే సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నరు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మెనూలో పెట్టడం చాలా బాగున్నది.
– స్వాతి (విద్యార్థిని), సీతారాంబాగ్ పాఠశాల, హైదరాబాద్