సిద్ధిపేట : ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద మదీనా ఫంక్షన్ హాలులో ఆదివారం సాయంత్రం ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. మంత్రి ఇఫ్తార్ విందులో సహఫంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలను గౌరవంగా నిలబెట్టారన్నారు.
దేశంలో ఇఫ్తార్ విందు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. అందరి సహకారంతో సిద్ధిపేటను అభివృద్ధి చేసుకున్నామని, అభివృద్ధి విషయంలో వేలెత్తి చూపేవారే లేరన్నారు. ప్రతి ఒక్కరూ సిద్ధిపేట అభివృద్ధి బాగుందని కొనియాడుతున్నారన్నారు. పట్టణంలో నిర్మించిన ఇండ్లలో 500 ముస్లిం మైనారిటీలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద మసీదు నిర్మాణం కూడా చేస్తున్నట్లు, పట్టణంలో ఖబరాస్తాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.15 లక్షలు నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ కోతలు అధికంగా ఉండేవనీ, ముస్లిం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ ఉండాలని ఆనాడు పలుమార్లు అప్పటి పాలకులను కోరినట్లు నాటి సంగతులను గుర్తు చేశారు.
పట్టణాన్ని అల్లా దయవల్ల సీఎం కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ముస్లిం ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచేలా షాదీ ముబారక్ పేరిట ఆర్థిక సాయం అందిస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని చెప్పారు. అంతే కాకుండా విద్య కోసం పెద్దపీట వేశారని మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేసి వారి చదువుకు భరోసా అందిస్తున్నారని తెలిపారు. దేశంలో మైనారిటీ పాఠశాలలు ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతి కోసం పాటు పడుతూ తెలంగాణ రాష్ట్ర మోడల్గా నిలిచిందని ఇటీవలే ఓ నివేదిక కూడా తెలిపినట్లు పేర్కొన్నారు.