జమ్మికుంట, జూన్ 25: చికిత్స పొందుతూ మరణించిన పేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. దవాఖానలో బిల్లులో రూ.4.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన చర్లపల్లి సుధాకర్(40) ఓ టీవీ చానల్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. హార్ట్ బైపాస్ సర్జరీ కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ దవాఖానలో చేరారు. గురువారం ఆపరేషన్ చేయగా, పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం మరణించారు. దవాఖాన బిల్లు రూ.8.90 లక్షలైంది. ఇందులో రూ.2.40 లక్షలు కుటుంబ సభ్యులు చెల్లించారు. మిగితా బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో జమ్మికుంటకు చెందిన ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు మంత్రి హరీశ్రావుకు ఫోన్ చేశారు. జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన ఆయన దవాఖాన యాజమాన్యంతో మాట్లాడారు. రూ.4.50 లక్షలు తాను చెల్లించేందుకు ముందుకు రావడంతో యాజమాన్యం అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. హైదరాబాద్ నుంచి అతని స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంటకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మంత్రి సొంత ఖర్చుతో అంబులెన్స్ను ఏర్పాటు చేయించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.