సిద్దిపేట, మే1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం కేసీఆర్కు గొల్లకుర్మలంటే ఎంతో ప్రేమ. అందుకే అసెంబ్లీలో గొల్లకుర్మల గురించి ప్రస్తావించారు. గొల్లకుర్మల గొప్పతనాన్ని, నైపుణ్యాన్ని గుర్తించిన నాయకుడు సీఎం కేసీఆర్. ఇదంతా ఓట్ల కోసం చేయలేదు. మనుసులో ఉన్న ప్రేమతో గొల్లకుర్మల గొప్పతనం గురించి చెప్పి, అసెంబ్లీ చరిత్ర పుటల్లో నిలిపిన నాయకుడు సీఎం కేసీఆర్’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీపై సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భైరి అంజయ్య గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీ పథకం వల్ల గొల్లకుర్మలతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతున్నదని చెప్పారు. పసుపును, పశువులను, పచ్చని చెట్లను కూడా పూజించే గొప్ప జాతి గొల్లకుర్మలు అని అన్నారు. మాట తప్పని మడమ తిప్పని వంశం గొల్ల కుర్మలది అని, సద్దితిన్న రేవు తలవాలని పేర్కొన్నారు. గొల్లకుర్మ జాతి గౌరవం పెంచిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలని చెప్పారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మొదటి దర్శనం గొల్లకుర్మలకే ఉంటుందని, వారు అంతటి అదృష్టవంతులని పేర్కొన్నారు. గొల్లకుర్మలకు సీఎం కేసీఆర్ రాజకీయంగా అవకాశాలు కల్పించారని చెప్పారు. జిల్లాలోని మూడు దేవాలయాల్లో మొదటిసారిగా గొల్లకుర్మలకే చైర్మన్లుగా అవకాశం ఇచ్చారని తెలిపారు. శ్రీకృష్ణడు ధర్మం వైపు నిలబడ్డట్టు, గొల్లకుర్మలు సైతం ధర్మం వైపు నిలబడాలని సూచించారు.
నిత్యం 600 లారీల గొర్రెలు దిగుమతయ్యేవి
దేశంలో ఏడాదికి సగటున ఒక మనిషి 5.4 కిలోల మటన్ తింటే, తెలంగాణలో 21.4 కిలోలు తింటున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణలో 99 శాతం మాంసాహారులేనని, రాజస్థాన్ రాష్ట్రంలో 31 శాతం మాత్రమే తింటారని చెప్పారు. రాష్ట్రంలో గొర్ల పథకం మొదలు కాకముందు ప్రతి రోజు హైదరాబాద్కు 600 లారీల గొర్రెల దిగుమతి జరిగేదని, అందుకే సీఎం కేసీఆర్ గొర్ల సంపదను పెంచడంపై దృష్టి పెట్టారని తెలిపారు. గొల్ల, కుర్మల అభ్యున్నతి కోసం రూ.11 వేల కోట్లు ఇచ్చిన నాయకుడు ఒక్క కేసీఆరేనని చెప్పారు. గొల్లకుర్మలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ర్టాల్లో కూడా ఇలాంటి పథకం తేలేదని అన్నారు.
తెలంగాణ ఆచరిస్తున్నదే.. దేశం అనుసరిస్తున్నది
దేశానికే దశదిశ చూపించే విధంగా తెలంగాణ జాతి గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని మంత్రి హరీశ్రావు అన్నారు. గత తొమ్మిదేండ్లలో కేసీఆర్ ఏం చేస్తే దేశం అదే చేస్తున్నదని చెప్పారు. అన్ని వర్గాలను కాపాడుతున్న సీఎం కేసీఆర్ వైపే అందరం నిలబడాలని పేర్కొన్నారు. నాడు కందుకూరి వీరేశలిం గం, మహాత్మా జ్యోతిబాపూలే, రాజారామ్మోహన్ రాయ్ వంటివారు బాల్యవివాహాలను అరికట్టేందుకు పోరాడారని, కానీ అవి పూర్తిగా ఆగిపోలేదని చెప్పా రు. సీఎం కేసీఆర్ తెచ్చిన గొప్ప సామాజిక విప్లవ పథకం కల్యాణలక్ష్మి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాల్యవివాహాలు పూర్తిగా ఆగిపోయాయని వివరించారు.
అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి
దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా జరపాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదని మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా జరపాలని ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. సిద్దిపేటలో యాదవుల కోసం బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ నిర్మించామని.. కుర్మల ఫంక్షన్హాల్ నిర్మాణంలో ఉన్నదని.. ఎన్ని డబ్బులైనా ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కోకాపేట్లో గొల్లకుర్మల ఆత్మగౌరవ భవనాలు పూర్తయ్యాయని, త్వరలోనే బ్రహ్మాండంగా వాటిని ప్రారంభించుకుంటామని తెలిపారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ఎక్కడ బీరప్ప జాతర జరిగినా..
తాను హాజరవుతానని.. ఆపద అయినా.. పండుగ అయినా.. మీతోనే ఉంటానని హరీశ్రావు చెప్పారు. అడవుల్లోకి గొర్రెలు వెళ్లే విధంగా అటవీ అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. తెలంగాణ వచ్చాక.. కొమురవెళ్లి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ను మూడేండ్లలో పూర్తి చేసుకున్నామని, అంతపెద్ద ప్రాజెక్ట్కు మల్లన్న పేరు పెట్టి జాతి గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని చెప్పారు. ఈ సదస్సులో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్లకాపరుల సంఘం అధ్యక్షుడు శ్రీహరియాదవ్, జిల్లాలోని గొల్లకుర్మ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
3 శాతం జనాభాకు 38 శాతం అవార్డులు
బీజేపీ నాయకులు గల్లీలో తిడుతూ.. ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. దేశంలో తెలంగాణ జనాభా మూడు శాతం ఉంటుందని, కానీ, జాతీయ అవార్డుల్లో మాత్రం 38 శాతం అవార్డులు మన రాష్ట్రం సాధించిందని తెలిపారు. మాంసపు ఉత్పత్తుల్లో తెలంగాణ నంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే అవార్డు ఇచ్చిందని అన్నారు. గతంలో మహబూబ్నగర్ నుంచి జీవాలను మేపడానికి నెలలునెలలు మానేరు డ్యామ్కు తీసుకెళ్లేవారని చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు ఎండాకాలంలో కూడా చెరువులు, చెక్డ్యామ్లు మత్తళ్లు దూకుతున్నాయని అన్నారు.