కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్ది కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా ఎదిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్పీకరించి జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రగతి నివేదిక రూపంలో వెల్లడించారు.
పదేళ్ల ప్రాయంలోనే రాష్ట్రం దేశానికే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరితేరిందని కొనియాడారు. తెలంగాణ సమాజం ఆత్మగౌరవం, స్వయం ఆస్తిత్వంతో ఐశ్వర్యవంతంగా నిలదొక్కుకుందని పేర్కొన్నారు . తెలంగాణ అంటే ప్రవహించే నదులను కలిపిన కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project) గుర్తుకు వస్తుందని అన్నారు. తెలంగాణలో ప్రతి రైతు తమకు బంధువు దొరికాడని సంతోషిస్తున్నారు.
ఇరవై నాలుగు గంటల కరెంటు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని వివరించారు. వృద్ధులకు ఆసరా, డబుల్ బెడ్ రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో తెలంగాణ ముఖచిత్రమే మారిందన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయిలో విస్తరిస్తున్న ఐటీ(IT), ఫార్మా(Pharma) పరిశ్రమలు ఎందరినో ఆశ్చర్యపరుస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఇటీవల నిర్మించబడిన ఎతైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, అతి సుందరమైన సచివాలయం చారిత్రాత్మకమైన చార్మినార్, గోల్కోండ వరసన నిలబడుతున్నాయని తెలిపారు.
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది
‘ తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం’ మని అన్నారు. 2013-14 సంవత్సరంలో 1,12,162 రూపాయలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం, 2022-23లో 3,08,732 రూపాయల వరకు చేరుకున్నదని వెల్లడించారు. ఇది జాతీయ సగటు అయిన రూ. 1,72,000 కంటే 79 శాతం ఎక్కువని అన్నారు. జాతీయ తలసరి ఆదాయంకన్నా తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,36,732 ఎక్కువగా ఉందని వివరించారు.
రైతు బంధు పథకం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేండ్లలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7,994 కోట్ల నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలు, 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా కరీంనగర్ జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 1,81,908 మంది రైతులకు 1556.63 కోట్ల రూపాయలను వారి ఖాతాలలో జమచేశామని మంత్రి పేర్కొన్నారు.
ఆసరా పింఛన్లు
వివిధ పింఛన్ల ద్వారా 1,41,344 మంది లబ్దిదారులకు రూ.3086.60 కోట్లు చెల్లించామని మంత్రి వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా 32,693 మంది లబ్దిదారులకు రూ.298 కోట్లను అందించామన్నారు. జిల్లాలో రెండు విడతలుగా కంటివెలుగు కార్యక్రమం ద్వారా 10 లక్షల మందికి కంటి పరీక్షలను నిర్వహించామని తెలిపారు. 21 రోజుల పాటు కొనసాగే దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు.