కరీంనగర్ : యాభై ఏండ్లుగా తెలంగాణకు రోడ్లు, నీళ్లు, కరెంటు తేని మోసగాళ్ల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామస్థులు గంగుల కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర చేసి ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతిల్లో పెట్టకండి, తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్ చేతుల్లో పెట్టాలని ఆయన కోరారు. గతంలో మన తాతలు ఆంధ్రలో కలపడం వల్ల 60ఏండ్లు అరిగోస పడ్డామని, అరవై ఏళ్లు వెనకబాటుకు గురయ్యామని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి అదే తప్పును మళ్లీ మనం చేయొద్దని వేడుకున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి తర్వాత ఎంపీగా గెలిపించారు.
కానీ ఏనాడైనా మీ సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చారా అని ప్రశ్నించారు. మళ్లీ నేడు ఓట్లకోసం వస్తున్నాడని, ఇలాంటి వాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ స్థానికంగా నీళ్లు, కరెంటు తెచ్చి రోడ్లు వేయించి, వాటి రిపేర్లను సైతం చేయిస్తూ మీ సేవ చేస్తున్న వ్యక్తిగా మరోసారి స్థానికంగా ఉండే తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.