కరీంనగర్ : రాష్ట్రం రాక ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో..ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి. నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న కొత్తపల్లిని అభివృద్ధి చేయాలని ఎవరికి మనసు రాలేదు. నేడు కొత్తపల్లి ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి చేశామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు. బుధవారం కొత్తపల్లిలోని కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.
నేడు కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం అయింది. మండుటెండల్లో చెరువులు మత్తల్లు దుంకుతున్నాయి. 1956లో చేసిన తప్పుతో తెలంగాణను ఆంధ్రలో బలవంతంగా కలిపితే మన వనరులు దోచుకున్నారు. ఆ పరిస్థితితో తెలంగాణ దోపిడీకి గురై దరిద్రాన్ని అనుభవించింది. మళ్లీ నేడు తప్పు చేస్తే తెలంగాణ 50 ఏళ్ల వెనక్కి వెళ్లడంతో పాటు మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
5 నెలల కాంగ్రెస్ పాలనకే కర్ణాటకలో ప్రజలు అల్లాడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పాదయాత్ర చేస్తున్నారు. తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టొద్దని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో భాగంగా 25 కుల సంఘాలు గంగులకు రానున్న ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నట్లు తీర్మానం చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ జమీలోద్దిన్, నాయకులు వాసాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.