కరీంనగర్ : ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పి హాస్పిటల్ డ్రామాలు ఆడే డ్రామా ఆర్టిస్ట్ బండి సంజయ్ అని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్, ఎలబోతారం గ్రామల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాల మధ్య గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..ప్రజలకు సేవ చేయమని ఎంపీగా గెలిపిస్తే నాలుగున్నరేళ్లు పత్తా లేకుండా పోయి..అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు వస్తున్నాడని ఆరోపించారు.
ఎంపీగా టికెట్ ఇవ్వమని చెప్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్క ఓటుకు ఇరవై వేలు సెల్ ఫోన్ ఇస్తానని వస్తున్నాడని ..ఆయన ఇచ్చే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాలుగున్నరేండ్లుగా ఎంపీగా సంజయ్ ఏం అభివృద్ధి చేశాడో గ్రామాల్లో మహిళలు నిలదీయాలని పిలుపునిచ్చారు. యాభై ఏళ్ల దరిద్రానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ లేనని..యాభై ఏళ్ల దరిద్రం కోరుకుందామా..పదేళ్ల కేసీఆర్ అభివృద్ధి కోరుకుందామా ఆలోచించుకోవాలన్నారు. పచ్చని తెలంగాణ పై ఆంధ్రోళ్ల కన్ను పడిందని, మరోసారి తెలంగాణపై ఆధిపత్యం కోసం కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు.