హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాలను నాణ్యాతా ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీసీ సంఘాల నేతలతో కలిసి కోకాపేట(Kokapeta) ఆత్మగౌరవ భవన నిర్మాణ సముదాయంలో పర్యటించారు. రెవెన్యూ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల పనులను పర్యవేక్షించారు.
ఆయన మాట్లాడుతూ రోడ్లతో పాటు సమాంతరంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్ పనులను పూర్తిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) వేలకోట్ల విలువైన స్థలాలను హైదరాబాద్ నడిబొడ్డున కోకాపేట్, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో బీసీ(BC)లకు కేటాయించారని, వీటి నిర్మాణంలో సైతం ఆయా కుల ఏక సంఘాల ట్రస్టులకే బాధ్యత అప్పగించామన్నారు.
మొత్తం 87.3 ఎకరాల్లో 95.25 కోట్లతో 41 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను కేటాయించామని, కోకాపేటలో యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలు ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యాయని వెల్లడించారు. మిగతా భవనాల నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని వేగంగా అందజేస్తూ వాటిని సైతం త్వరలో పూర్తి చేస్తామన్నారు.
ఇప్పటికే మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, బసవేశ్వర భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అనంతరం మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం డిజైన్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, నాయకులు చల్లా హరిశంకర్, బీసీ సంక్షేమ శాఖ జేడీ చంద్రశేఖర్, డీడీలు సంద్య, విమలాదేవి, వాటర్ వర్క్స్ డీఈ నరహరి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ వెంకన్న, హెచ్ఎండీఏ అధికారి ప్రవీణ్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.