హైదరాబాద్ : రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నత విద్యావంతుడు కాబట్టే వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ గురుకులాల ఏర్పాటుపై కేసీఆర్కు పంపాల్సిన ప్రతిపాదనలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 281 బీసీ గురుకులాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 143 పాఠశాలలు, మరో 119 పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ అయ్యాయని చెప్పారు. మరో 19 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నట్లు పేర్కొన్నారు. బీసీ గురుకులాల్లో 1,52,440 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కొత్తగా మరో 33 గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొత్త గురుకులాల ద్వారా మరో 7,920 మందికి విద్యార్థులకు లబ్ది చేకూరుతుందన్నారు. మరో 15 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 3,600 మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో 21 స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కావాల్సిన నైపుణ్యాల కోసం ఇక్కడ శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కమలాకర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ సొసైటీ సెక్రటరీ మల్లయ్య బట్టు, స్టడీసర్కిళ్ల డైరెక్టర్ అలోక్ కుమార్ పాల్గొన్నారు.