హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇప్పటి వరకు 9,31,316 మంది లబ్ది పొందారు. బీసీ సంక్షేమం ద్వారా 4,35,365 మంది లబ్ధి పొందారు. గిరిజన సంక్షేమం ద్వారా 1,11,876 మంది, మైనార్టీ సంక్షేమం ద్వారా 1,95,960 మంది లబ్ది పొందారు. ఎస్సీ సంక్షేమం ద్వారా 1, 88,212 మంది లబ్ధి పొందారు. ఈ పథకాల కోసం ఇప్పటి వరకు రూ. 7,720.8 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
మనసున్న మారాజు సీఎం కేసీఆర్.. పేదింటి ఆడబిడ్డలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకానికి రూపకల్పన చేశారు. బిడ్డ పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేసేవారు. ఆ బాధలు తల్లులు పడొద్దనే ఉద్దేశంతో ప్రస్తుతం రూ. లక్షా నూట పదహారు ఇస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కరోనా కాలంలో కూడా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.