Minister Gangula Kamalakar | తెలంగాణకు ముందు నీటి కోసం జిల్లాల మధ్య నీటి యుద్ధాలు జరిగేవని, స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలమైందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. లోయర్ మానేర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి గంగుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మానేరు నుంచి దిగువకు 9లక్షల ఎకరాల సాగుభూమి కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. రైతుల నుంచి డిమాండ్ తక్కువగా ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా ప్రస్తుతం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.
అవసరమైతే పెంచుతామన్నారు. కాలువ ద్వారా నీరు వరంగల్ జిల్లా మీదుగా సూర్యాపేట వరకు వెళ్లనున్నాయన్నారు. తెలంగాణ రాక ముందు ఇదే మానేరు జలాశయం నుంచి ఆనాటి కాంగ్రెస్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్ జిల్లాకు నీటిని తీసుకెళ్తానని చూస్తే మా జిల్లాకు ఇచ్చిన తర్వాతే నీటిని తీసుకెళ్లాలని ఆందోళన చేసి ఆపేసామని గుర్తు చేశారు. తెలంగాణ రాక ముందు నేర్రలు బారిన నేలలతో గొంతులు ఎండి పోయిన పరిస్థితులు ఉండేవని, కానీ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో 40 నుంచి 50 టీఎంసీల నీటిని అందిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం నీటితో చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లి పంటలు సమృద్ధిగా పండి దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి ఎగువ మానేరుకు కూడా డిమాండ్ మేరకు నీటిని విడుదల చేస్తామన్నారు.