Karimnagar | తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మండుటెండల్లో మత్తడి దూకే స్థాయికి చేరుకున్నామన్నారు. గతంలో నీటి సమస్యలతో బిందెలతో కొట్టుకునే పరిస్థితులుండేవని గుర్తుచేశారు. పది సంవత్సరాలుగా అభివృద్ది కొనసాగుతుందన్నారు. ఆంధ్ర
నేతలకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను నాశనం చేస్తాయని.. తద్వారా 50ఏళ్ల వెనక్కి వెళ్లే పరిస్థితులు వస్తాయన్నారు. కర్నాటకను పాలిస్తున్న కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఓటర్లు ఆచితూచి జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. ఢిల్లీ పాలకుల చేతుల్లోకి వెళ్తే తెలంగాణను అప్పులపాలు చేస్తారని చెప్పారు. భవిష్యత్ తరానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి గంగులతోపాటు మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.