కరీంనగర్ : బీజేపీ(BJP) పార్టీలో టికెట్లు ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన వ్యక్తి బండి సంజయ్(Bandi Sanjay) అని, ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు మళ్లీ వస్తున్నాడని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula )ఫైర్ అయ్యారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి గంగుల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..బీసీ బిడ్డ తుల ఉమ పోటీ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తికి రూ.20 కోట్ల రూపాయలకు టికెట్ బండి సంజయ్ అమ్ముకున్నాడని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతి సారి ఎదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకోవాలని చూస్తాడని, ఆయన యాక్టింగ్ బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లను మించిపోయిందని ఎద్దేవా చేసారు. భు మాఫియాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయన సర్పంచ్గా అవకాశం ఇస్తే కబ్జాలు చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీ భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడని హెచ్చరించారు.
బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు భూమాఫియా లో భాగస్వాములు అని అన్నారు. తనకు వ్యాపారాల వల్ల డబ్బులు సంపాదిస్తే బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలు మీ బిడ్డల భవిష్యత్ను సూచించే ఎన్నికలు అని, ఒక్క ఓటు తప్పు జరిగితే మీ పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు.