హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సీఎం కే చంద్రశేఖర్రావు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురుకులాల ఉద్యోగులు అంకిత భావంతో విధులను నిర్వర్తించాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, రీజినల్ కో ఆర్డినేటర్లు, వార్డెన్లు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ బీసీల విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 19 గురుకులాలే ఉండగా, 310కి పెంచారని.. 1,65,400 మంది బీసీ బిడ్డలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నారని కొనియాడారు. 700 హాస్టళ్లలో 413 ప్రీ మెట్రిక్, 287 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 57,783 మందికి ఆశ్రయం కల్పిస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు. అక్టోబర్లో నూతనంగా మరో 33 గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ కాలేజీలను అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, గురుకుల సెక్రటరీ మల్లయ్యభట్టు, ఉన్నతాధికారులు బాలాచారి, అలోక్ కుమార్, చంద్రశేఖర్, సంధ్య, ఉదయ్తోపాటు ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వార్డెన్లు, డీబీసీడీవో, ఏబీసీడీవోలు దాదాపు 1000 మంది పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయండి
బీసీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న చిన్నారులను సొంత బిడ్డల్లా చూడాలని ఉద్యోగులకు మంత్రి గంగుల సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసే బాధ్యత ప్రతి ఉద్యోగి తీసుకోవాలని పిలుపునిచ్చారు. విధినిర్వహణలో ఏ ఒక ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ఎక్కడా ఎలాంటి లోపం తలెత్తవద్దని స్పష్టంచేశారు. శానిటేషన్, బిల్డింగ్ నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతీ హాస్టల్కు ఏటా రూ.50 వేలు ఇస్తున్నదని, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆహార నాణ్యత నిత్యం పరీక్షించాలని, పారిశుద్ధ్య లోపం లేకుండా చూసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్య రికార్డులను కచ్చితంగా నిర్వహించాలని, అందుకోసం ఆరోగ్య శాఖతో అనుసంధానమై పనిచేయాలని ఆదేశించారు. దసరా పండగ తర్వాత స్వయంగా తాను అవసరమైన శాఖల అధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లను సందర్శిస్తానని తెలిపారు.