హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా సహకరించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గోదాము ల్లో స్థలం, ర్యాక్లు, మిల్లుల ట్యాగింగ్, హమాలీల కొరత తదితర సమస్యలు ఉత్పన్నం కాకుం డా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలు ఎదురైతే ఢిల్లీలోని ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సోమవారం ఆయన ఎంసీఆర్హెచ్చార్డీలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్కు త్వరలోనే సమగ్ర నివేదిక అందిస్తామని తెలిపారు. సీఎం ఆమోదం తెలిపిన వెం టనే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణను ప్రోత్సహించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు రైతుల నుంచి 6.72 కోట్ల టన్నుల ధాన్యం సేకరించి, వారికి రూ.1.21 లక్షల కోట్లు చెల్లించినట్టు వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని గంగుల కమలాకర్ తెలిపారు. యాసంగి ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియోట్యాగింగ్, ట్రాన్స్పోర్టు, మిల్లర్ల అనుసంధానం, గన్నీబ్యాగ్లు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు తదితర వనరులను సంపూర్ణంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, రైతులను ఇబ్బంది పెట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సే వలను పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఐవీఆర్ఎస్ నంబర్ 79975 12345ను మంత్రి గంగుల ప్రారంభించారు. సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్ వీ అనిల్కుమార్, ఎఫ్సీఐ డీజీఎం కిరణ్కుమార్, కంటైనర్ కార్పొరేషన్ ఈడీ జీఆర్ శేషగిరిరావు, అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఏంలు పాల్గొన్నారు.