కరీంనగర్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డంగా దొరికాడని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో మంగళవారం రాత్రి బండి సంజయ్తోపాటు ఆయన అనుచరులు డబ్బుల పంపిణీకి వెళ్లి.. సీసీ ఫుటేజీలో రికార్డు అయిన వివరాలను మంత్రి గంగుల బుధవారం కరీంనగర్లోని తన నివాసంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. బండి సంజయ్ తన అనుచరులతో కలిసి రెండు వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లి కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని మడిగిల వాడలో పంచే ప్రయత్నం చేశారని, ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని మంత్రి మీడియా ముందు ప్రదర్శించారు.
బండితోపాటు ఆయన అనుచరులు డబ్బులు పంచుతున్న వ్యవహారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వెళ్లి ప్రశ్నించారని తెలిపారు. రాత్రి పూట బండితోపాటు.. కరీంనగర్కు చెందిన నాయకులకు కొత్తపల్లిలో ఏం పనంటూ ప్రశ్నించారు. స్థానికులు నిలదీసే సరికి తమ బండారం బయట పడుతుందని భావించి వెంటనే మాట మార్చారని తెలిపారు. డబ్బులను బీఆర్ఎస్ పార్టీయే పంచుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందని, అందుకే తాము వచ్చామని బీజేపీ నాయకులు పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచినట్టు సమాచారం వస్తే.. సదరు విషయాన్ని పోలీసులు లేదా ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఒక ఎంపీగా ఆ బాధ్యత బండి సంజయ్కు లేదా? అలాంటప్పుడు ఎందుకు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రచారం చేయరాదన్న విషయం తెలియదా? అని బండిని ప్రశ్నించారు. మరి రాత్రి తొమ్మిది గంటలకు రెండు వాహనాల్లో కొత్తపల్లికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మూడు సంచుల్లో డబ్బులు తీసుకెళ్లింది వాస్తవం కాదా? చెప్పాలన్నారు. ధర్మం, నీతి గురించి చెప్పే బండి సంజయ్ ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచలేదని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసే దమ్ముందా? అని సవాల్ విసిరారు.