హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఈ యాసంగిలో తెలంగాణ నుంచి రా రైస్కు బదులుగా బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకోసం బుధవారం ఢిల్లీలో కేంద్ర అధికారులతో భేటీ కానున్నట్టు వెల్లడించారు. గత యాసంగిలో కేంద్రం తీరుతో ధాన్యం సేకరణలో ఎంతో ఇబ్బంది పడ్డామని, అది పునరావృతం కాకుండా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ నిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కేంద్రాన్ని కోరుతామని స్పష్టంచేశారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారని, ఆయన ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. సోమవారం ఆయన పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర డైరీని పౌరసరఫరాల భవన్లో చైర్మన్ రవీందర్సింగ్తో కలిసి ఆవిష్కరించారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ఉద్యోగులకు హెల్త్కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. కార్పొరేషన్లలోని 244 మంది ఉద్యోగులతోపాటు వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ ద్వారా క్యాష్లెస్ వైద్యసేవలను అందించనున్నట్టు తెలిపారు.
చెడ్డపేరు తెస్తే సహించేది లేదు
రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలని పౌరసరఫరాల కార్పొరేషన్ ఉద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్నైనా ఉపేక్షించబోమని, కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందన్నారు. 2014-15లో 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుతం ఇది 1.41 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. గత పంటల సీఎంఆర్ను వేగంగా పూర్తి చేయాలని, రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యాసంగిలోనూ వేగంగా ధాన్యం సేకరించాలని ఆదేశించారు. ఇందుకోసం రైస్ మిల్లులు, గోదాములను ఖాళీ చేయాలని ఆదేశించారు.