కరీంనగర్ : త్యాగాలకు మారుపేరు సంత్ సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ అన్నారు.
బంజారాలకు ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక సప్తగిరి కాలనీలో నిర్వహించిన ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. సేవాలాల్ త్యాగాలకు ప్రతీక అని, ధైర్యానికి మారుపేరు అని కొనియాడారు.
దేశం కోసం బంజారాలు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జీవ హింస వద్దని, హిందూ ధర్మం కోసం దేశమంతా ప్రచారం చేసిన మహనీయుడు సంత్ అని మంత్రి తెలిపారు.
బంజారాలు సేవాలాల్ మందిర, భవన నిర్మాణం చేసుకునేందుకు గాను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన రూ. 10 లక్షల ప్రొసీడింగ్స్ ను మంత్రి సభాముఖంగా బంజారా నాయకులకు అందజేశారు. అనంతరం భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సవాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప, కార్పొరేటర్ డి. మహేష్, తిరుపతి నాయక్, ఉత్సవ కమిటీ నాయకులు ఎల్. రూప్సింగ్, లక్ పతి నాయక్, భాస్కర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.