కరీంనగర్ : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్లనే ఎందరో గొప్ప వ్యక్తులుగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫేర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జ్యోతిరావు పూలే పార్క్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పుస్తకాలకు జీవం పోయాల్సిన అవసరం ఉందన్నారు.
కవులు, కళాకారుల ఖిల్లా కరీంనగర్ జిల్లా అని పేర్కొన్నారు. పుస్తకం సమాజాన్ని మార్చుతుందన్నారు. సీఎం కేసీఆర్ పుస్తక ప్రేమికుడని, పుస్తకాలను చదవడం వల్లనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని అన్నారు. జిల్లాకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుస్తకాలు చదవడంతో పాటు అనేక పుస్తకాలు రాసి అంతర్జాతీయంగా పేరు గడించారని తెలిపారు.
డాక్టర్ సి.నారాయణరెడ్డి గొప్ప కవిగా గుర్తింపు తెచ్చుకున్నారని, పద్మ విభూషణ్ శ్రీభాష్యం విజయసారథి సంస్కృత పండితుడిగా, నలిమెల భాస్కర్ బహు భాషావేత్తగా గుర్తింపు పొందారని అన్నారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు విజ్ఞానం పెంపొందించే పుస్తకాలను పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో భాగంగా వారం రోజుల పాటు మహిళా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పుస్తకప్రియుడని, ఆయన ప్రోత్సాహం వల్లనే కరీంనగర్ లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈనెల 4వ తేదీన సాహిత్య అకాడమీ పక్షాన అన్ని పాఠశాలల్లో మన ఊరు -మన చెట్లు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన స్వాగత నృత్యం అలరించింది. ఎల్ ఎం డి కాలనీ ఎం జె పి పాఠశాల కు చెందిన అభినయ పాడిన పాట ఆకట్టుకుంది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ‘అమ్మా నాన్న ప్రేమ’ పై రాసిన పాట ఆకట్టుకుంది.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డి ఆర్ డి ఓ శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా,జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, తదితరులు పాల్గొన్నారు..