కరీంనగర్ : ఇచ్చిన మాట మేరకు యాదాద్రికి బస్సు సర్వీసును ప్రారంభించామని, ప్రజలంతా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్ సర్వీస్ను కరీంనగర్ ఒకటో డిపోలో బస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కోసమే పని చేస్తామని, ఆర్టీసీ బస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రిని నేడు గొప్ప పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దారని, ఒకప్పుడు యాదాద్రికి వెళ్లాలంటే.. హైదరాబాద్ వెళ్లి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.
ప్రస్తుతం ప్రజల కోరిక మేరకు కరీంనగర్ నుంచి సర్వీసును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం సర్వీసులను ఆర్టీసీ నడుపుతుండగా, త్వరలో మరో రెండు కొత్త బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరీంనగర్ నుంచి ప్రారంభం అయ్యే ఈ బస్సులు నుస్తులాపుర్, కొత్తపల్లి, చిగురుమామిడి, హుస్నాబాద్ మీదుగా నడుస్తాయన్నారు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సులను యాదాద్రి ఎక్స్ప్రెస్గా నామకరణం చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆర్టీసీ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.