సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం ఇన్చార్జిగా ఉన్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ ఉదయం నుంచి బిజీ బిజీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యకర్తలతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీపట్ల, సీఎం కేసీఆర్ పాలనపట్ల స్థానిక ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటామని వారు ముక్తకంఠంతో చెబుతుండడం ఆనందంగా ఉందని చెప్పారు.
స్థానికంగా అందుబాటులో ఉండని రాజగోపాల్ రెడ్డికి ఒకసారి ఓటేసి మోసపోయామని, మరోసారి ఆ తప్పు చేయబోమని స్థానికులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. కూసుకుంట్లను గెలిపిస్తే స్థానికంగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న ప్రతి చోటా జరిగిన బ్రహ్మాండమైన అభివృద్ధి మునుగోడులో కూడా జరుగుతుందని చెప్పారు. ప్రజల నుంచి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక బీజేపీ కొత్త డ్రామాలకు తెరతీసిందన్నారు. బీజేపీ ఎన్ని డ్రామాలు చేసిన మునుగోడులో మూడో స్థానానికే పరిమితమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని చెప్పారు.
అంతకు ముందు నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రచార తీరుతెన్నులపై వారికి దిశానిర్దేశం చేశారు. పలు సంఘాల ప్రతినిధులు కలిసి మంత్రికి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రేమ్చంద్రారెడ్డి, సర్పంచ్ సిక్ల మెట్ల శ్రీహరి, ఫాక్స్ చైర్మన్ జెక్కిడి జంగారెడ్డి, టీఆర్ఎస్, సీపీఐ శ్రేణులు పాల్గొన్నారు.