హైదరాబాద్ : ఈ నెల 21న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రిస్మస్ సంబురాలపై మంత్రి కొప్పుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో మాదిరిగానే ఈ సారి సీఎం కేసీఆర్ క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధితశాఖ అధికారులు మంత్రికి వివరించారు. వేడుకల్ని తిలకించేందుకు ఆరు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, శంకర్ లూక్, మైనారిటీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రతినిధులు రాయడన్ రోస్, విద్యా స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందు మంత్రి ఈశ్వర్ క్రిస్మస్ వేడుకలకు హాజరు కావాలని మెథడిస్ట్ బిషప్ ఎంఏ డానియెల్ను ఆహ్వానించారు. అబిడ్స్ చాపెల్ రోడ్లోని బిషప్ నివాసానికి వెళ్లి మంత్రి స్వయంగా ఆహ్వానపత్రికను అందజేశారు. వేడుకలకు సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.