పాలకుర్తి (జనగామ) : జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో పునర్నిర్మించిన ఆలయంలో సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 4న త్రిదండి చిన్న జీయర్ స్వామి (Tridandi Chinna Jeeyar Swami) చేతుల మీదుగా విగ్రహాల పున: ప్రతిష్టాపన, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా మంగళవారం వల్మిడి దేవాలయ ప్రాంగణంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో ఏర్పాట్లను సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆది కావ్యం రామాయణ సృష్టి కర్త వాల్మీకి మహర్షి పుట్టిన ఊరుగా వల్మిడి ప్రసిద్ధి చెందిందని అన్నారు.
ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే నిధులు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. మంత్రులు (Ministers) హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉత్సవాల్లో పాల్గొంటారని వివరించారు.
30వేల మంది హాజరు అంచనా..
నాలుగురోజుల పాటు జరిగే ఉత్సవాలకు 30 వేల మంది వరకు ప్రజలు ఆలయాన్ని సందర్శించే అవకాశము ఉందని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వివిధ కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించాలని ఆదేశించారు. ఉత్సవాల కోసం ఆర్టీసీ (RTC) బస్సులను ప్రత్యేకంగా నడిపించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. తొర్రూరు, హనుమకొండ, వరంగల్, జనగామ డిపోల నుంచి బస్సులు నడిపించాలని ఆదేశించారు.
ప్రచార రథాలను పరిశీలించిన మంత్రి
దేవాలయ పునః ప్రారంభం, విగ్రహాల పునః ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా ప్రచారం నిర్వహించే ప్రచార రథాలను మంత్రి పరిశీలించారు. ఇందుకు సిద్ధం చేసిన ఆరు వాహనాలు పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లో ప్రచారం చేపడుతాయని పేర్కొన్నారు.
పార్కింగ్ (Parking) పై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇంటింటికి స్వామివారి పసుపు, కుంకుమ ప్రసాదాల పంపిణీ చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ సీతారాం, ఏసీబీ సురేష్ కుమార్, ఆర్టీసీ, విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీసు, పంచాయతీరాజ్, దేవాదాయ, డీఆర్డీవో వంటి వివిధ శాఖల అధికారులు మహిళలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.