జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా వివక్షకు, నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్వితీయ ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. దేశంలో 50 శాతానికిపైగా ధాన్యాన్ని ఒక్క మన రాష్ట్రమే అందిస్తున్నదని, దేశానికి ధాన్యాగారంగా రాష్ట్రం మారిందని అన్నారు.
రైతులకు అవసరమైన రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి ప్రభుత్వ పథకాలతో కోటిన్నర ఎకరాలు సాగు జరిగి, దిగుబడులు కూడా అధికమయ్యాయి అని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సిన కేంద్రం కాళ్ళల్లో కట్టె పెట్టినట్లు ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ మన రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన పాలసీ, మద్దతు ధర ముందుగానే ప్రకటించాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన యవుసం బాగు పడదని అన్నారు. కెసిఆర్ ఆలోచనతో నిజమైన రైతు రాజ్యం వస్తుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.