జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంగళవారం జరిగిన పలు వేడుకల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్లలో మహంకాళమ్మ తల్లికి బోన మెత్తారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కాల బైరవుడిని దర్శించుకున్నారు.
మహిళలతో కలిసి కాటమయ్య గుడి చుట్టూ ప్రదక్షణలు చేశారు. మొహర్రం సందర్భంగా పీరీ ఎత్తారు. మార్కెట్ యార్డు సమీపంలో జెడ్పీటీసీ నిధులతో ఏర్పాటు చేసిన హై మాస్ట్ లైట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దయవల్ల సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.