గుండాల (యాదాద్రి భువనగిరి) : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar Rao) ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో తెలంగాణ పల్లె ప్రగతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని విశ్లేషించుకోవాలని సూచించారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.చాలా మంది సీఎం లను చూశా.కానీ సీఎం కేసీఆర్(CM KCR) లాంటి అభివృద్ధి చేసిన నాయకుడిని తన రాజకీయ జీవితంలో చూడలేదని పేర్కొన్నారు.సమైక్య రాష్ట్రంలో గ్రామాలు ఇంతగా ఎప్పుడూ అభివృద్ధి చెందలేదని వెల్లడించారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు ప్రగతి నిలయాలుగా మారాయని తెలిపారు.
సీఎం కేసీఆర్కు ప్రజలంతా రుణపడి ఉండాలని కోరారు. కాలేశ్వరం(Kaleshwaram Project) లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో ప్రతి పల్లెకూ సాగునీరు అందుతుందని అన్నారు. గుండాల మండలాన్ని దత్తత తీసుకుంటున్నాని ప్రకటించారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ వచ్చాకే అభివృద్ధి అంటే ఏమిటో తెలిసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.